ఈ నెల 25న గగనతలంలో ఓ అందమైన, మహా అద్భుతం ఆవిష్కృతం కానుంది. సౌరకుటుంబంలోని రెండు గ్రహాలు, నెలవంక (చంద్రుడు) సమీపంలోకి రానుండటంతో గగనతలంలో 'స్మైలీ ఫేస్' ఏర్పడనుంది. ఈ మేరకు సైన్స్ వెబ్సైట్ 'లైవ్సైన్స్' వెల్లడించింది.
ఏప్రిల్ 25న తెల్లవారుజాముకు ముందు శుక్రుడు, శని... చందమామ (నెలవంక)కు అతి సమీపంలోకి రానున్నాయి. ఒక దగ్గరే కనిపించనున్న ఆ మూడు... 'స్మైలీ ఫేస్' ఆకృతిని ప్రతిబింబించనున్నాయి. సూర్యోదయానికి ముందు అతి తక్కువ సమయం మాత్రమే కనిపించనున్న ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా వీక్షించేందుకు అవకాశం ఉంది. రెండు గ్రహాలు నయనాలుగా, నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలుగా కనిపించనుంది. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రెండా కల్బర్ట్సన్ వెల్లడించారు. శుక్రుడు, శని ప్రకాశవంతంగా ఉండడంతో వాటిని మాములుగా వీక్షించవచ్చు. అయితే, స్మైల్ ఇమేజ్ను చూసేందుకు మాత్రం స్టార్గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ అవసరం కానున్నాయి.