ముంబై.: నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటుచేశారు. భుషావల్ రైల్వే డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంయుక్త సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఏటీఎం చక్కగా పనిచేసిందని రైల్వే అధికారులు తెలిపారు. నగదు ఉపసంహరణకే కాక, చెక్బుక్కు ఆర్డర్ ఇవ్వడానికి, ఖాతా స్టేట్మెంట్లు తీసుకోవడానికి కూడా ఈ ఏటీఎంను వినియోగించుకోవచ్చు. ఏసీ కోచ్తోపాటు మిగిలిన అన్ని కోచ్లవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.