'వక్ఫ్ బై యూజర్'గా నమోదైన ఆస్తులపై డీనోటిఫై చేయొద్దు!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ‘వక్ఫ్ బై యూజర్’గా నమోదై ఉన్నవి సహా వక్ఫ్ ఆస్తులను వేటినీ డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకూ సిద్ధమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవీ జారీ చేయవద్దంటూ కేంద్రం కేవియట్ దాఖలు చేయడంతో విచారణను గురువారం (ఏప్రిల్ 17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టంలోని పలు అంశాలపై కేంద్రానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. కేంద్రం చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, రాజీవ్ ధవన్, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన సరికాదని, వందల ఏళ్లుగా చాలా ఆస్తులు ‘వక్ఫ్ బై యూజర్ (ఎలాంటి పత్రాలు లేకుండా చాలా కాలం నుంచి వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్నవి)’గా కొనసాగుతున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. అయితే వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వందల ఏళ్లుగా వ్యక్తిగత ట్రస్టులుగా కొనసాగుతున్న ‘వక్ఫ్ బై యూజర్’లను ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారు? వాటికి పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? రిజిస్టర్ చేసుకోకుంటే వక్ఫ్ గుర్తింపు (డీనోటిఫై) తొలగిస్తే ఎలా? ఇంతకుముందు చాలా సందర్భాల్లో కోర్టులు ‘వక్ఫ్ బై యూజర్’ను గుర్తించాయి. ఇప్పుడు మీరు గుర్తింపును వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు చెలరేగుతాయి..’’ అని స్పష్టం చేసింది. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బోర్డులు సహా వక్ఫ్గా కోర్టులు ప్రకటించిన ఆస్తులు వేటినీ డీనోటిఫై చేయవద్దని సూచించింది.